రాజమహేంద్రవరం: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెలలో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్(జీఎస్పీసీ) పరిహారాన్ని బాధిత మత్స్యకారులకు అందజేసేందుకు సీఎం ఇటీవల జరిగిన క్యాబినెట్లో ఆమోదం తెలిపారు. ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల్లోని సుమారు 17,550 మంది మత్స్యకారులకు ఏడు నెలల కాలానికి పరిహారానికి రూ.80 కోట్లు విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఆ పరిహారాన్ని ముమ్మిడివరంలోనే సీఎం చేతులు మీదుగా పంపిణీ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సీఎం ముమ్మిడివరం వచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదించిన క్రమంలో వచ్చే నెల 21న ముహూర్తంగా నిర్ణయించారు.
పరిహారం పంపిణీతోపాటు అదే నియోజకవర్గం ఐ.పోలవరం మండలంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రూ.35 కోట్లతో శంకుస్థాపన చేయగా పూర్తయిన పశువుల్లంక-సలాదివారిపాలెం వంతెనను కూడా సీఎంతో ప్రారంభింపజేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్ శుక్రవారం తగు ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటన 21న దాదాపు ఖాయమైందని కార్యక్రమం ఎలా నిర్వహించాలనేది మంత్రులు, ప్రజాప్రతినిధులు త్వరలో నిర్ణయిస్తారని కలెక్టర్ తెలిపారు.