అమరావతి: మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో.. 2018 బ్యాచ్ డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్సవాంగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సవాళ్లను ఎదుర్కొనేందుకు డీఎస్పీలు సిద్ధంగా ఉండాలన్నారు. సైబర్, చిట్ఫండ్, వైట్కాలర్ నేరాలపై దృష్టిపెట్టాలని సూచించారు.
మహిళలపై దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడమే మన బాధ్యత అని గౌతమ్ సవాంగ్ సూచించారు. అనంతరం సుచరిత మాట్లాడుతూ.. త్యాగం, సేవకు పోలీసులు నిదర్శనమన్నారు. గ్రామీణాభివృద్ధిలో పోలీసులు కీలకపాత్ర పోషించాలన్నారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని సుచరిత పిలుపునిచ్చారు.