దిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్టు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయన ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయాన్నే ముగ్గురు ఈడీ అధికారులు జైలుకు చేరుకొని దాదాపు గంటపాటు ఆయన్ను ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చేశారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 55రోజుల సీబీఐ జ్యుడీషియల్ కస్టడీ తర్వాత చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయనను అరెస్టు చేసేందుకు ఈడీ అధికారులకు ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. నగదు అక్రమ చలామణి అంశంపై ప్రశ్నించేందుకు ఈడీకి అనుమతినిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ ఉత్తర్వులు జారీ చేశారు.