ముంబయి: బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడుతూ ఈ బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. దేశంలోని ఫస్ట్క్లాస్ క్రికెటర్ల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. భారత క్రికెట్కు మేలు చేసేందుకే తామున్నామని, క్రికెట్ కమిటీలు, సంఘాల్లోకి మాజీ క్రికెటర్లు రావడం సంతోషదాయకమని, ముంబయి నగరం టీమిండియాకు ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లను అందించిందని చెప్పారు. ప్రస్తుతం భారత జట్టు అద్భుతంగా ఉందని కెప్టెన్ కోహ్లీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని గంగూలీ స్పష్టం చేశారు.
కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టినందున కెప్టెన్, కోచ్ గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదని దాదా వ్యాఖ్యానించారు. భారత క్రికెట్ చరిత్రలో మహేంద్రసింగ్ ధోనీది ప్రత్యేక స్థానమని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కెప్టెన్, కోచ్ ఎంపికంతా సెలెక్షన్ కమిటీ చేతుల్లోనే ఉంటుందన్నారు. టీమిండియా కెప్టెన్లంతా బీసీసీఐ అధ్యక్షులతో సఖ్యంగానే ఉన్నారని గుర్తుచేశారు.