అమెరికా: భారతీయులు ఆనందంగా జరుపుకొనే దీపావళి వేడుకలను అగ్రరాజ్యం అమెరికాలో శనివారం ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. వైట్హౌస్లో జరిగిన ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొనడం గమనార్హం. దేశంలోని ప్రముఖ ప్రవాస భారతీయులు, వైట్హౌస్ సిబ్బంది పాల్గొన్న వేడుకలతో అక్కడ సందడి నెలకొంది. పండుగ జరుపుకొంటున్న హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు ట్రంప్, ఆయన సతీమణి మెలానియాలు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ అమెరికా దేశ ప్రధాన సిద్ధాంతాల్లో ఒకటైన మత స్వేచ్ఛకు దీపావళి వేడుకలు నిదర్శనమన్నారు. దేశంలోని అన్ని మతాల ప్రజలు తమ విశ్వాసాలకు అనుగుణంగా పండుగు జరుపుకొనే స్వేచ్ఛ అమెరికా కల్పిస్తోందని, వారి హక్కులను కాపాడేందుకు కృషి చేస్తామని తెలిపారు. అమెరికా అధ్యక్షుని అధికారిక నివాసమైన వైట్హౌస్లో 2009 నుంచి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.