పూర్ణం బూరెలు
కావాల్సిన పదార్ధాలు: సెనగపప్పు – ఒక కప్పు, బెల్లం – ఒక కప్పు, మినప్పప్పు – ఒక కప్పు, బియ్యం – రెండు కప్పులు, నూనె – సరిపడా, ఉప్పు – రుచికి తగినంత, యాలకుల పొడి – అర టీస్పూన్, నీళ్లు – తగినన్ని.
తయారీ విధానం: మినప్పప్పు, బియ్యంను ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి. సెనగపప్పు, బెల్లం సమానంగా తీసుకొని బెల్లంను మెత్తగా తురుముకోవాలి. సెనగపప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడకకుండా చూసుకోవాలి. కుక్కర్లో నుంచి పప్పు బయటకు తీసి చల్లారిన తరువాత మిక్సీ పట్టుకోవాలి. నీళ్ల పోయకూడదు. ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని బెల్లం వేసి, కొద్దిగా నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం కరిగి పొంగు వస్తున్న సమయంలో మెత్తగా పట్టి పెట్టుకున్న పప్పు వేసి కలుపుకొని కాసేపు వేగించుకోవాలి. అందులో యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. బాగా నానిన మినప్పప్పు, బియ్యంలో నీరంతా వంపేసి దోసెల పిండిలా మిక్సీలో వేసి పట్టుకోవాలి. తరువాత అర టీస్పూన్ ఉప్పు వేయాలి. ఇప్పుడు ఒక పాత్రను తీసుకొని నూనె పోసి కాస్త వేడి అయ్యాక పప్పు మిశ్రమాన్ని చిన్నచిన్న బూరెల మాదిరిగా చేయాలి. వాటిని మినప్పప్పు, పిండి మిశ్రమంలో ముంచుకుంటూ నూనెలో వేగించుకుంటే నోరూరించే పూర్ణం బూరెలు సిద్ధం.