కోల్కతా: బీసీసీఐ అధ్యక్షుడు కాబోతున్న టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నాడు. తాజాగా భారత్, పాక్ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలపై పెదవి విప్పాడు. దాయాదుల క్రికెట్ సమరాలకు రెండు దేశాల ప్రధానుల అనుమతి తప్పక అవసరమని పేర్కొన్నాడు.
భారత్, పాక్ క్రికెట్ సంబంధాల పునరుద్ధరణపై గంగూలీని విలేకరుల సమావేశంలో ప్రశ్నించగా ‘ఈ ప్రశ్న మీరు మోదీజీ, పాక్ ప్రధాన మంత్రిని అడగాలి. అనుమతి తీసుకోక తప్పదు. ఎందుకంటే అంతర్జాతీయ పర్యటనలు అన్నీ ప్రభుత్వ అనుమతులతోనే కొనసాగుతాయి. అందుకే మీరడిగిన ప్రశ్నకు సమాధానం లేదు’ అని దాదా అన్నాడు.
చివరిసారిగా భారత్, పాక్ 2012లో రెండు టీ20లు, 3 వన్డేల పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్లో తలపడ్డాయి. పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోయడం, యుద్ధాలకు దిగడంతో ఆ దేశంతో సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత గంగూలీ నేతృత్వంలోనే టీమిండియా 2004లో పాక్లో చారిత్రక పర్యటనకు వెళ్లింది. 1989 తర్వాత భారత జట్ట అక్కడ పర్యటించడం అదే తొలిసారి. పుల్వామా ఘటన తర్వాత దాయాదుల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.