విజయవాడ: తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ వ్యవహారంపై టీడీపీ నేత కేశినేని నాని స్పందించారు. వంశీని వదులుకోవడానికి టీడీపీ పార్టీ సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. ఆయన తరఫున పోరాడడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని, కేసులకు భయపడి రాజకీయాలకు దూరం కాకూడదని సూచించారు. వంశీతో మాట్లాడడానికి తాను ప్రయత్నిస్తున్నానని కేశినేని నాని తెలిపారు. వంశీలాంటి మంచి రాజకీయ నేత రాజకీయాలను దూరంగా ఉండడం మంచిది కాదని అన్నారు. వంశీది టీడీపీ డీఎన్ఏ అని వ్యాఖ్యానించారు. కాగా, వంశీతో మాట్లాడాలంటూ కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావులను చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే.
