బెంగళూరు: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ టీవీఎస్ సరికొత్త అపాచీ బైక్ను మార్కెట్లోకి విడుదల చేసింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4V పేరిట దీన్ని తీసుకొచ్చింది. ఇది టీవీఎస్ మొబైల్ యాప్ ‘స్మార్ట్ కనెక్ట్’తో బ్లూటూత్ ఆధారంగా పనిచేస్తుంది. గూగుల్ ప్లేస్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్లో ఈ మొబైల్ యాప్ లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది.
బ్లూటూత్ కనెక్టవిటీతో పనిచేసే ఈ యాప్లో అధునాతన ఫీచర్లను జోడించారు. నావిగేషన్, రేస్ టెలీమెట్రీ, టూర్ మోడ్, లీన్ యాంగిల్ మోడ్, క్రాష్ అలెర్ట్, కాల్/ఎస్సెమ్మెస్ నోటిఫికేషన్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. లీన్ యాంగిల్ మోడ్లో అది ఫోన్ గైరోస్కోప్ సెన్సార్ను ఉపయోగించుకుని బైక్ ఎంత వాలుగా ప్రయాణించిందో బైక్ డిస్ప్లేలో చూపిస్తుంది. మీరెంత దూరం ప్రయాణించారో సంబంధిత వివరాలను టెలీమెట్రీ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ బైక్ ఎక్కడైనా కింద పడితే వెంటనే మీ ఫోన్లోని ఎమర్జెన్సీ నంబర్కు సందేశం వెళుతుంది. 180 సెకన్లలో అది అవతలి వ్యక్తికి చేరుతుందని కంపెనీ పేర్కొంది.
ఇక ఈ బైక్లో 197.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ను అమర్చారు. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇందులో ఉంది. దీని ధరను రూ.1.14,345 (ఎక్స్ షోరూమ్ దిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. బ్లాక్, వైట్ కలర్స్లో దేశవ్యాప్తంగా ఈ నెల నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.